న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. కరోనా విలయానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి బాధ్యులెవరనే పేరుతో సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాన్ని ప్రియాంక ప్రారంభించారు.
సెకండ్ వేవ్ వ్యాప్తితో ఆక్సిజన్ పడకలు, వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో లేక ప్రజలు మరణిస్తుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూసిందని ఆరోపించారు. కేంద్రం ప్రేక్షక పాత్ర వహించడంతో కరోనా పరిస్థితి చేయిదాటిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసిందని బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. సెకండ్ వేవ్ తో దేశవ్యాప్తంగా పలువురు మరణించారని, ఎంతోమంది తమ ప్రియమైన వారిని కోల్పోయారని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు.