రెండో రోజూ కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె
బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
న్యూఢిల్లీ, మార్చి 16: ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం రెండో రోజు కూడా దేశవ్యాప్తంగా నిరసన చేపట్టారు. వేలాది మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగదు ఉపసంహరణ, డిపాజిట్, చెక్ క్లియరెన్స్, నగదు చెల్లింపు సేవలు ఆగిపోయాయి. ప్రభుత్వ ట్రెజరీ, బిజినెస్ లావాదేవీలకు కూడా ఆటంకం ఏర్పడింది. తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ (యూఎఫ్బీయూ) రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. మంగళవారం కూడా సమ్మె విజయవంతంగా సాగిందని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తెలిపారు. ముఖ్యంగా యువ ఉద్యోగులు సమ్మెలో చురుగ్గా పాల్గొన్నారని, ఎందుకంటే ప్రైవేటీకరణ వల్ల కలిగే ముప్పు వారికి తెలుసునని ఆయన పేర్కొన్నారు.
మోదీ సర్కారు.. లాభాల్ని ప్రైవేట్పరం చేసి, నష్టాల్ని జాతీయం చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ బ్యాంకులను మోదీ తన కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టడం వల్ల దేశ ఆర్థిక భద్రత ప్రమాదంలో పడుతుందని ఆరోపించారు.
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం విరమించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బ్యాంకుల సమ్మెలో భాగంగా మంగళవారం యూఎఫ్బీయూ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణ, యూఎఫ్బీయూ కన్వీనర్ బీఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నా రు. బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రజలకు శరాఘాతమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.