న్యూఢిల్లీ: ఒక వైపు దేశవ్యాప్తంగా కరోనా టీకాల కొరత నెలకొనగా మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులకు 1.29 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా అయినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. అయితే ఇందులో మే నెలలో కేవలం 17 శాతం టీకాలను మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రులు వినియోగించగా సుమారు 1.07 కోట్ల వ్యాక్సిన్ డోసులు మిగిలి ఉన్నాయి. ఈ నెల 4న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం మే నెలలో దేశవ్యాప్తంగా 7.4 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 1.85 కోట్ల డోసులను ప్రైవేట్ ఆసుపత్రులకు కేటాయించగా 1.29 కోట్ల డోసుల టీకాలను అవి సమకూర్చుకున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇందులో కేవలం 22 లక్షల డోసులను మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రులు వినియోగించాయి. దీంతో సుమారు 1.07 కోట్ల టీకా డోసులు వాటి వద్ద ఉన్నాయి. అయితే ప్రైవేట్ ఆసుప్రతుల్లో టీకాల ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపడం లేదని తెలుస్తున్నది.