న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం నేరుగా తయారీదారుల నుంచి మార్కెట్ ధరలకు వ్యాక్సిన్ డోసులను సేకరించేందుకు కేంద్రం అనుమతించనుంది. దేశవ్యాప్తంగా బుధవారం మూడు లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగుచూసిన క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మొడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లకు అనుమతి లభించగానే ఆయా వ్యాక్సిన్లనూ ప్రైవేట్ సంస్ధలు నేరుగా దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించింది. కరోనా కేసుల పెరుగుదలతో మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ సంస్ధలు నేరుగా ఎంత పరిమాణంలో భారత డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించిన వ్యాక్సిన్లను నేరుగా దిగుమతి చేసుకోవచ్చని, ఈ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.