లక్నో : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో మహమ్మారి బారినపడిన రోగులు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నారు. ఆక్సిజన్ పడకలు లభించక దేశవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. విపత్తు వేళ దళారులు ఆక్సిజన్ సిలిండర్ ను రూ 30,000కు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. స్వార్ధపరుల కాసుల దాహం ఇలా ఉంటే యూపీలోని హమీర్పూర్ జిల్లాలో మనోజ్ గుప్తా అనే వ్యాపారి కేవలం రూపాయికే ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తూ కరోనా రోగులకు కొండత అండగా నిలిచారు.
తన బాట్లింగ్ ప్లాంట్లలో గుప్తా ఇప్పటివరకూ వేయికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను నింపి వేలాది మంది కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడారు. తాను ఈ విపత్కర పరిస్థిని ఎదుర్కొన్నానని అందుకే కరోనా రోగుల బాధను అర్ధం చేసుకుని రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేస్తున్నానని గుప్తా చెప్పుకొచ్చారు. తమ రిమ్జిమ్ ఇస్పాత్ ఫ్యాక్టరీలో రోజుకు వేయి ఆక్సిజన్ సిలిండర్లను రూపాయికే రీఫిల్ చేసి అవసరార్ధులకు అందిస్తున్నానని గుప్తా పేర్కొన్నాడు. హోంఐసోలేషన్ లో ఉన్న కొవిడ్ రోగుల బంధువులు రోగి ఆర్టీపీసీఆర్ రిపోర్ట్, డాక్టర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు చూపి ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్ చేయించుకుంటున్నారు. ఝాన్సీ, బందా, లలిత్ పూర్, కాన్పూర్, ఓరై, లక్నో సహా పలు జిల్లాల నుంచి తమ ఆప్తుల ప్రాణాలను కాపాడుకునేందుకు గుప్తా ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంట్ ఎదుట బారులు తీరుతున్నారు.