ముంబై: బీజేపీ సీనియర్ నాయకుడు, దివంగత గోపినాథ్ ముండే కుమార్తెల్లో ఒక్కరికి కూడా తాజా క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కలేదు. దాంతో పంకజ ముండే కేరీర్ను అంతం చేయడానికే బీజేపీ అధిష్ఠానం వారిని పక్కన పెట్టిందని ప్రచారం జోరందుకుంది. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు పంకజ ముండే ముందు ప్రస్తావించగా.. తానుగానీ, తన సోదరి ప్రీతమ్ ముండేగానీ ఏనాడు కూడా మంత్రి పదవుల కోసం డిమాండ్ చేయలేదని చెప్పారు.
ఇప్పుడు రాష్ట్రం నుంచి మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న వారితో తమకు ఎలాంటి విభేదాలు లేవని, వారు కూడా తన తండ్రి గోపీనాథ్ ముండే అనుచరులేనని పంకజ ముండే చెప్పారు. తమ కేరీర్ను ముగించడానికే బీజేపీ తమను పక్కన పెట్టిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని పంకజ ముండే తోసిపుచ్చారు. శివసేనకు చెందిన సామ్నా సంపాదకీయంలో కూడా ఈ విషయాన్ని రాశారని మీడియా గుర్తుచేయగా.. తాను ఆ సంపాదకీయం చదవలేదని చెప్పారు.