రామాయంపేట/చేగుంట/నిజాంపేట/మనోహరబాద్, మే 16 : రామాయంపేట, తూప్రాన్, మనోహరబాద్, నార్సింగి, చేగుంట, నిజాంపేట మండలాల్లో ఆదివారం లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. దుకాణాదారులు ఉదయం 6 నుంచి పది గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచడంతో ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం పది గంటల తర్వాత ప్రజలు తమ ఇండ్లకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో ఆయా మండలాల్లోని రోడ్లు, బస్స్టాండ్లు, దుకాణాలు నిర్మానుష్యంగా మారాయి. పట్టణాల్లోని వ్యాపార, వర్తక, వాణిజ్య, సంస్థలన్నీ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను పాటిస్తున్నాయి. పోలీసులు పది నుంచి మళ్లీ మరుసటి ఉదయం 6 గంటల వరకు గస్తీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచిస్తున్నారు. మాస్క్ ధరించకుండా బయటకు వచ్చిన వారికి జరిమానాలు విధిస్తున్నారు.
తూప్రాన్ రూరల్లో..
తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో లాక్డౌన్ ఆదివారం ప్రశాంతంగా కొనసాగింది. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఉదయమే పట్టణానికి చేరుకొని వారికి కావాల్సిన వస్తు సామగ్రిని కొనుగోలు చేసి తమ ఇండ్లకు తిరిగి వెళ్లిపోయారు. 10 గంటల తర్వాత వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, కూరగాయల మార్కెట్లు అన్నీ మూసివేశారు. దీంతో పట్టణ ప్రధాన రహదారితో పాటు, రద్దీగా ఉండే పలు కాలనీల్లో ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో నిర్మానుష్యంగా మారాయి. ఉదయం పది తర్వాత తీసిఉన్న దుకాణాలు, అనుమతి లేకుండా వాహనాలతో తిరుగుతున్న వాహనదారులకు పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు.
వెల్దుర్తిలో..
కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్కు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ స్వచ్ఛందంగా ఇండ్లకే పరిమితం అవుతున్నారు. మండల కేంద్రాలైన వెల్దుర్తి, మాసాయిపేటతో పాటు మారుమూల పల్లెల్లో సైతం ప్రజలు పది గంటల వరకే దుకాణాలను తెరిచి ఉంచుతున్నారు. దీంతో ప్రజలు తమకు కావాల్సిన సరుకులు తీసుకొని తిరిగి ఇండ్లకు వెళ్లిపోతున్నారు. 44వ జాతీయ రహదారి వాహనాలు లేక నిర్మానుష్యంగా మారింది.