న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ భారత పారాలింపిక్ బృందంతో భేటీ అయ్యారు. జపాన్ రాజధాని టోక్యోలో ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5 వరకు జరుగనున్న పారాలింపిక్స్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 54 మంది సభ్యుల బృందం వెళ్తున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ వారితో కలిసి మాట్లాడారు. ‘కరోనా మహమ్మారి మీ కష్టాలను రెట్టింపు చేసింది. అయినా మీరు మీ ఆటలను, సాధనను వదులుకోలేదు. అసలైన క్రీడాకారులకు ఉండాల్సిన లక్షణం ఇదే’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
‘పారాలింపిక్స్లో మీ విజయాలు, మీరు సాధించబోయే పతకాలు దేశానికి ఎంతో ముఖ్యం. కానీ ఈ నవ భారతదేశం పతకాలు సాధించుకు రావాలంటూ మీపై ఎప్పుడూ ఒత్తిడి చేయదు. ముందుగా మీరు మీ ప్రతిభను నూటికి నూరు శాతం ప్రదర్శించండి. పతకం వస్తుందా.. రాదా.. అనేది తర్వాత విషయం’ అని ప్రధాని ఆటగాళ్లకు సూచించారు. ఈ సందర్భంగా గుజరాత్కు చెందిన పారా-బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పారుల్ దల్సుఖ్భాయ్ పార్మర్తో ప్రధాని మాట్లాడారు.
‘మీకు మరో రెండేండ్లలో 50 ఏండ్ల వయసులో అడుగపెట్టబోతున్నారు. ఇప్పటిదాకా మీరు మీ ఫిట్నెస్ను కాపాడుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. ఈ రాఖీ పండుగకు మీరు తప్పకుండా మీ సోదరుడికి బహుమతి ఇస్తారని (పారాలింపిక్స్లో పతకం సాధిస్తారని) అనుకుంటున్నా’ అని ప్రధాని దల్సుఖ్భాయ్ పార్మర్తో వ్యాఖ్యానించారు.