లక్నో : వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పాలక బీజేపీ సన్నద్ధమవుతోంది. గత ఐదు రోజుల్లో రెండోసారి యూపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సిద్ధార్ధనగర్ చేరుకున్నారు. సిద్ధార్ధ్నగర్, ఈటా, హర్దోయ్, ప్రతాప్ఘఢ్, ఫతేపూర్, దియోరియా, ఘజీపూర్, మీర్జాపూర్, జాన్పూర్ జిల్లాల్లో 9 మెడికల్ కాలేజీలను ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు. గత పాలకులు తమ కుటుంబ లాకర్లు నింపుకోవడంలో తలమునకలై స్వార్ధ ప్రయోజనాల కోసం పనిచేశారని మోదీ విమర్శలు గుప్పించారు.
ఒకేసారి తొమ్మిది వైద్య కళాశాలలను గతంలో ఎన్నడైనా ప్రారంభించడం చూశారా అని ప్రశ్నించారు. పూర్వాంచల్ ప్రజలను గత ప్రభుత్వాలు గాలికొదిలేశాయని, తమ హయాంలో పూర్వాంచల్ ప్రాంతం ఉత్తరాదికే మెడికల్ హబ్గా మార్చామని చెప్పుకొచ్చారు. ఇక ప్రధాని మోదీ తన నియోజకవర్గం వారణాసిలో రూ 5200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.