న్యూఢిల్లీ: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. భూపేంద్ర పటేల్ తనకు చాలా ఏండ్లుగా తెలుసని, ఆయన ఉత్తమమైన పనితీరును తాను గమనించానని ప్రధాని చెప్పారు. ఆయన భారతీయ జనతాపార్టీ కోసమైనా, పరిపాలనలోనైనా, సమాజసేవలోనైనా ఉత్తమ పనితీరు కనబరుస్తారని కొనియాడారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ ఒక ట్వీట్ ( PM tweet ) చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మరో 15 నెలల గడువు మాత్రమే ఉండటంతో బీజేపీ హైకమాండ్ విజయ్ రూపానీ చేత రాజీనామా చేయించి, భూపేంద్ర పటేల్ను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికచేసింది. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం భూపేంద్ర పటేల్ గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ క్రమంలో కొత్త ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.