తిరుమల : తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో మే ఒకటో తేదీ నుంచి భక్తులకు దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఈఓ రాజేంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ స్వామి వారి దర్శన సమయాల్లో మార్పులు చేస్తూ.. ఉప ఆలయాల్లో దర్శనాలు రద్దు చేసింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలుపుతారు. అనంతరం 6.30 గంటలకు స్వామి వారికి తోమాల సేవ, సహస్రనామార్చన సేవలు నిర్వహించనున్నారు. ఈ సేవల కాలంలో భక్తులకు లఘు దర్శనం కల్పిస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు, 9.30 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనానికి అనుమతించరు. రాత్రి కైంకర్యాలు, ఏకాంత సేవ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. అలాగే గోవింద రాజస్వామి ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాల్లో భక్తులకు దర్శనాలను రద్దు చేశారు. భక్తులు విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.