మెదక్ మున్సిపాలిటీ, మెదక్ 30 : మున్సిపాలిటీల్లో బకాయిలు పేరుకుపోకుండా ముందస్తు పన్నులు చెల్లించే వారికి ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఏటా బల్దీయాల్లో ఏప్రిల్ మాసంలో ‘ఎర్లీబర్’్డ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ‘ఎర్లీబర్డ్’ పథకం ద్వారా ఆశించిన మేరకు పన్నులు వసూలు కాకపోవడంతో ఈనెల చివరి వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 31 లోపు ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ అవకాశం కల్పించింది. ఆదివారంతోపాటు సెలవు దినాల్లో సైతం మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉండి పన్ను చెల్లించుకునేలా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో మెదక్తోపాటు నర్సాపూర్, తూఫ్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలు ఉన్నాయి.
మున్సిపాలిటీ పరిధిల్లోని ఇండ్ల యాజమానులు 2021-22 సంవత్సరానికి ముందస్తు ఆస్తి పన్ను చెల్లిస్తే ప్రభుత్వం 5 శాతం రాయితీ కల్పించింది. గత ఏడాదిన్నరగా కొవిడ్-19 ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేలలోపు ఆస్తి పన్నులు గల ఇండ్లకు 50 శాతం మాఫీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎర్లీబర్డ్ పథకం ద్వారా ముందస్తు పన్నుల చెల్లింపులపై ప్రభుత్వం 5 శాతం రాయితీ కల్పించింది. మున్సిపాలిటీల్లో ఆటోల ద్వారా రాయితీపై ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం మెదక్ మున్సిపాలిటీ రూ.5.12 కోట్ల ఆస్తి పన్నులే లక్ష్యం కాగా, 98 శాతం ఆస్తి పన్నులు వసూళ్లు చేసింది. ‘ఎర్లీబర్డ్’ పథకం ద్వారా నేటి వరకు రూ.75 లక్షల ఆస్తి పన్ను వసూలు చేశారు.
క్యూఆర్ కోడ్తోనూ చెల్లింపులు..
ఆస్తి పన్ను చెల్లింపులకు ఈ ఏడాది బల్దీయాలో క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకోచ్చారు. డిమాండ్ నోటీస్పై క్యూఆర్ కోడ్ను ముద్రించారు. పన్ను చెల్లింపుదారులు మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా డిమాండ్ నోటీస్పై గల క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆస్తి పన్ను వివరాలు ప్రత్యక్షమవుతాయి. క్రెడిట్, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్ పే లాంటి వ్యాలెట్ల ద్వారా తక్షణమే పన్ను చెల్లించవచ్చు. అలాగే రసీదును సైతం ఆన్లైన్లోనే పొందవచ్చు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చాలా మంది ఆన్లైన్ చెల్లింపులకు మొగ్గు చూపిస్తున్నారని సంబంధిత అధికారులు చెబుతున్నారు.