పర్యావరణం పచ్చగా ఉండాలి. ప్రజలు చల్లగా ఉండాలి. అదే అతడి కల. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి.. ఏకంగా అడవిని సృష్టించాడు. అతడి ఇరవైయేండ్ల కృషి ఫలితంగా.. ఓ పెద్ద స్మారకారణ్యం ప్రాణం పోసుకుంది. శేష జీవితాన్ని చెట్లూ చేమల మధ్య గడిపి రేపటి తరానికి అడవిని బహుమతిగా ఇచ్చిన ఆ వ్యక్తి పేరు.. ఆనంద్ దవాజ్ నేగీ.
అది హిమాచల్ప్రదేశ్లోని ఎగువ కిన్నౌర్ ప్రాంతం. మొత్తం ఎడారిలా ఉంటుంది. ఎటూ చూసినా బీడు భూములే. చాలా తక్కువ జనాభా. ఆ దృశ్యం ఆనంద్ దవాజ్ నేగీ కంట్లో పడింది. దాన్ని పచ్చదనానికి కేంద్రంగా మార్చాలని అనుకున్నాడు. ఈ సంకల్పానికి ఓ నేపథ్యం ఉంది.
ప్రజాధనం ఎందుకని..
సునామ్ గ్రామానికి చెందిన ఆనంద్ ధావాజ్ నేగీ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (డీడీపీ) ఫైనాన్స్ విభాగంలో ఆడిటర్గా పని చేసేవాడు. ఈ ప్రాంతంలో ఎడారీకరణ ప్రభావాలను తగ్గించడానికి ఆ సంస్థ ఓ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. దీర్ఘకాలం పనిచేసినా డబ్బు వృథా అయ్యిందే తప్ప ఫలితం కనిపించలేదు. ఆడిటర్గా కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు కావడం కండ్లారా చూశాడు నేగీ. ‘స్వచ్ఛందంగా పనిచేస్తే ఎవరి ఒత్తిడీ ఉండదు. కాంట్రాక్టర్ల కథలు నడవవు’ అనిపించింది. 1998లో తానే స్వయంగా థాంగ్కర్మ అనే చోటునుంచి పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. ఎడారిని ఒక అటవీ అధ్యయన కేంద్రంగా మార్చాలని కల గన్నాడు. యూనివర్సిటీ విద్యార్థులకు, ఔషధ అధ్యయనాలకు ఇదొక విజ్ఞాన సర్వస్వం కావాలని ఆకాంక్షించాడు.
సన్నాఫ్ సాయిల్
‘ఎడారి నేలలను సారవంతంగా తీర్చిదిద్దుతా, పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకుంటా’ అంటూ సర్కారుకు నచ్చ చెప్పి, 1998లో అధికారికంగా అనుమతి తీసుకున్నాడు. అప్పటినుంచి స్వచ్ఛందంగా పనిచేస్తూ ‘సన్నాఫ్ సాయిల్’గా గుర్తింపు పొందాడు. అక్కడ పని చేస్తున్నప్పుడు అతడు థాంగ్కర్మలోని బంజరు ఎడారి ప్రాంతాన్ని గుర్తించాడు. దాన్ని హరితవనంగా మార్చాలనుకున్నాడు నేగీ. అప్పటి వరకు ఉద్యోగం చేస్తూనే ప్రాజెక్ట్ను నడిపించిన నేగీ, 2003 నుంచీ పూర్తి దృష్టి దీనిపైనే పెట్టాడు. ఈ కార్యక్రమ లక్ష్యం ఎడారీకరణను అరికట్టడం, పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడం. అడవులను పరిరక్షిస్తేనే, పర్యావరణం పచ్చగా ఉంటేనే వర్షాలు సమృద్ధిగా పడుతాయి, పంటలు సక్రమంగా పండుతాయనే ఆలోచనతో ముందుకెళ్లాడు.
అడవే ప్రపంచంగా..
ఎడారుల్లో అడవిని అభివృద్ధి చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాడు నేగీ. బంజరుభూమిని ఆకుపచ్చ అడవిగా మార్చే ప్రక్రియను నర్సరీతో ప్రారంభించాడు. కంటూర్ ప్లాంటేషన్ కోసం కొంత స్థలాన్ని అభివృద్ధి చేశాడు. కానీ, విత్తనాలు నాటే ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎడారి ప్రాంతం కాబట్టి, నీటి సరఫరా సమస్యలూ చుట్టుముట్టాయి. 80% మొక్కలు వాడిపోయాయి. ఇంతకాలం సంపాదించిన సొమ్మునంతా ఖర్చు చేసి వర్షపు నీటిని పరిరక్షించడానికి, ఉపరితల కోతలనుంచి నేల నష్టాన్ని తగ్గించడానికి కాంటూర్ బండింగ్ను నిర్మించాడు. వర్షపు నీటిని ఒడిసి పట్టాడు.
22 ఏండ్ల కృషితో, 65 హెక్టార్ల భూమిలో 30 వేల చెట్లతో పచ్చని అడవిని సృష్టించాడు ఆనంద్ ధావాజ్ నేగీ. ఇప్పుడు ఈ అడవి విలువ రూ. 4 కోట్లు. ఇరవై ఏండ్లపాటు అడవిని సృష్టించడమే లక్ష్యంగా కృషి చేశాడు నేగీ. అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ఒక గొప్ప సందేశాన్నిచ్చాడు. సమీప గ్రామాల ప్రజలకు అడవిని ఎలా ఉపయోగించుకోవచ్చో నేర్పించాడు. ఎడారి ప్రాంతాన్ని పచ్చగా తీర్చిదిద్దేందుకు రెండు దశాబ్దాలు అడవితోనే సహవాసం చేశాడు. లక్ష్యంలో తలమునకలైపోయి, తన గురించి, తన వాళ్ల గురించి, తన ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది మే 23న ‘బ్రెయిన్ స్ట్రోక్’తో నేగీ ఆ అడవికి దూరమయ్యాడు. అయితేనేం, ఆ అడవిలోని చెట్టూ పుట్టా అతడి స్మారక చిహ్నంగా
మిగిలాయి.