న్యూఢిల్లీ : మినీ సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం మొదలైంది. తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. అలాగే అసోంలో చివరి దశ, బెంగాల్లో మూడో దశకూ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మంగళవారం నాలుగు రాష్ట్రాల్లోని 445, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలు, రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. ఆరు గంటల వరకు కొనసాగనుంది. చివరి గంటలో కొవిడ్ పాజిటివ్ రోగులకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. అలాగే 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు.
తమిళనాడులో ఈ సారి జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకంగా మారాయి. డీఎంకే మాజీ నేత, సీఎం కరుణానిధి, ఏఐఏడీఎంకే చీఫ్ జయలలిత మరణానంతరం తొలిసారిగా అసెంబ్లీ సమరం జరుగుతోంది. దీంతో ఇరు పార్టీలకు ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. డీఎంకే, అన్నా డీఎంకేతో పాటు కమల్హసన్, దినకర్ పార్టీలు తొలిసారిగా ఎన్నికల బరిలో ఉన్నాయి. నాలుగు పార్టీల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే పోరు కీలకంగా మారింది. రాష్ట్రంలో ఉన్న 234 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. 6.28 కోట్ల మంది ఓటర్లు 3,998 మంది అభ్యర్థుల భవితవ్యం నిర్ణయించనున్నారు. ఎన్నికల కోసం 88,397 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. 1,29,165 బ్యాలెట్ యూనిట్లు, 91,180 కంట్రోల్ యూనిట్లు (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) అందుబాటులో ఉంచారు. 4,17,521 మంది పోలింగ్ సిబ్బందిని ఎన్నికల కోసం నియమించారు. అలాగే రాష్ట్ర పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలు, హోంగార్డులతో పాటు 1.58లక్షల మంది బలగాలను మోహరించారు.
కేరళలో ఉన్న 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. ఎన్నికల కోసం 40,771 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగనుంది. రాష్ట్రంలో 2,74,46,039 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఇందులో 1,32,83,724 మంది పురుషులు, 1,41,62,025 మంది మహిళలు, 290 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. 957 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల్లో అందరి దృష్టి పాలక్కడ్ నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి తొలిసారిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ పోటీ చేస్తున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల కోసం 1,558 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 324 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. 10,04,507 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఎన్నికలు ప్రధానంగా కాంగ్రెస్-డీఎంకే, ఏఐఏడీఎంకే-బీజేపీ-అఖిల భారత కాంగ్రెస్ మధ్య పోటీ కొనసాగుతోంది.
మరోవైపు, పశ్చిమ బెంగాల్లో మూడు జిల్లాల పరిధిలో ఉన్న 31 నియోజకవర్గాల్లో మూడో దశ అసెంబ్లీ జరుగనున్నాయి. దక్షిణ 24 పరగణాలు, హౌరా, హుగ్లి జిల్లాల పరిధిలో ఓటింగ్ జరుగనుంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకంగా మారాయి. దక్షిణ పరగణంలోని 16, హుగ్లీలోని ఎనిమిది, హౌరాలోని ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 78,56,474 మంది ఓటర్లు ఓట్లు వేయననున్నారు. ఎన్నికల కోసం 10,871 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూడో విడత ఎన్నికల బరిలో 205 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో చివరి దశలో 40 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అధికార బీజేపీ నేతృత్వంలోని కూటమి, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ‘మహాజోత్’ కూటమి మధ్య పోరు జరుగుతోంది. మూడవ దశలో 79,19,641 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 40 నియోజకవర్గాల పరిధిలో 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.