రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించే మిల్లెట్స్
రోజువారీ ఆహారంలో ఇవి భాగం కావాలి
హైదరాబాద్, జూలై 29: రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నల్లాంటి చిరుధాన్యాలు(మిల్లెట్స్) ఎక్కువగా తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుందని, మధుమేహం వచ్చే ముప్పు తగ్గుతుందని ఇక్రిశాట్ నేతృత్వంలోని స్మార్ట్ ఫుడ్ ఇనిషియేటివ్ అధ్యయనంలో వెల్లడైంది. డయాబెటిస్ను దూరం పెట్టాలంటే రోజువారీ ఆహారంలో భాగంగా చిరుధాన్యాలు తీసుకోవడం మేలని సూచించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(నిన్), యూకేకు చెందిన రీడింగ్ వర్సిటీ తదితర సంస్థలు కూడా ఈ అధ్యయనంలో పాలుపంచుకొన్నాయి. మధుమేహం, చిరుధాన్యాలకు సంబంధించి 11 దేశాలకు చెందిన 80 అధ్యయనాలను సమీక్షించి ఈ వివరాలను ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్లో ప్రచురించారు. ‘మధుమేహం ఉన్నవారు రోజూ చిరుధాన్యాలు తింటే వారి రక్తంలో గ్లూకోజ్ 12-15శాతం తగ్గి వ్యాధి రాకమునుపటి స్థాయికి పడిపోయింది’ అని అధ్యయన నివేదిక వెల్లడించింది. చిరుధాన్యాల్లో ైగ్లెసెమిక్ ఇండెక్స్ 52.7 శాతం అని, ఇది బియ్యంతో పోలిస్తే 30 శాతం తక్కువ అని పేర్కొన్నది. ైగ్లెసెమిక్ ఇండెక్స్ అంటే.. మనం తీసుకొన్న ఆహారం రక్తంలో ఎంత మేర గ్లూకోజ్ పెరగడానికి కారణం అవుతున్నదో చెప్పే కొలమానం. ప్రజలు తమ ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకొని వ్యాధి బారిన పడకుండా ఉండటానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని నిన్ డైరెక్టర్ హేమలత అన్నారు. మధుమేహం నియంత్రణ కోసం ప్రభుత్వాలు రూపొందిస్తున్న విధానాలకు కూడా ఇది దోహదం చేస్తుందని చెప్పారు.