న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాలుగు రోజులపాటు జమ్ముకశ్మీర్లో పర్యటించనున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రపతి పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్, లడఖ్లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం కార్గిల్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఈ నెల 27న కశ్మీర్ విశ్వవిద్యాలయం 19వ స్నాతకోత్సవం ప్రసంగిస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
చైనా దురాక్రమణ యత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం పకడ్బందీగా పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద నియంత్రణ కార్యకలాపాలకు నియోగించిన దళాలను తూర్పు లఢక్కు తరలించింది. సుమారు 15 వేల మంది సైనికులను కొన్నాళ్లక్రితం లఢక్ సెక్టార్కు పంపినట్టు అధికార వర్గాలు తెలిపాయి. చైనా సైన్యం తలపెట్టే ఎలాంటి దుస్సాహక చర్యనైనా దీటుగా ఎదుర్కోవడంలో ఈ అదనపు దళాలు లేహ్లోని సైనిక ప్రధాన కార్యాలయానికి అండదండలు అందిస్తాయని పేర్కొన్నాయి. గత ఏడాది వాస్తవాధీన రేఖ వెంబడి చైనా జరిపిన చొరబాట్ల కారణంగా భారత్ సైనిక తరలింపును ముమ్మరం చేసింది. దీంతో ఎప్పుడూ ఒకడివిజన్ సైన్యం మాత్రమే ఉండే లఢక్లో ఇప్పుడు రెండు డివిజన్ల సైన్యం మోహరించింది. పలు భారీ శతఘ్నులు, ఇతర ఆయుధాలను బలగాలకు అండగా సిద్ధం చేశారు. మరోవైపు చైనా ముందుకు వస్తే మొదటగా ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన పర్వతయుద్ధ యూనిట్లను కూడా బలోపేతం చేస్తున్నారు.