మంచాల మే 16 : పల్లెసీమల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి గ్రామాలను అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నది. అపరిశుభ్రతకు నిలయంగా ఉన్న గ్రామం పల్లె ప్రగతితో కొత్త శోభను సంతరించుకున్నది. మంచాల మండలం బోడకొండ ప్రగతి పనులతో గ్రామ రూపురేఖలు మారి స్వచ్ఛతకు మారు పేరుగా నిలిచింది. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.80లక్షల నిధులతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీ, వైకుంఠధామం, హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమం వర్మీ కంపోస్ట్ యార్డు, పల్లెప్రకృతి వనం, రైతు వేదికకు నిధులు కేటాయించారు. ప్రతి రోజూ వార్డుల్లో పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించడం, కలుపు మొక్కలను తొలిగించడం, మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించే పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.
వైకుంఠధామం ఏర్పాటు..
గ్రామంలో గతంలో వైకుంఠధామం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.12.60 లక్షలతో వైకుంఠధామాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించారు.
వర్మీ కంపోస్ట్ తయారీ..
గ్రామంలో సేకరించిన చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ను తయారు చేయడానికి రూ. 2.30 లక్షలతో కంపోస్ట్ యార్డును నిర్మించారు. రోజూ గ్రామంలో ట్రాక్టర్ ద్వారా సేకరించిన తడి, పొడి చెత్తను యార్డుకు తరలించి ఎరువు తయారు చేస్తున్నారు. ఎరువును హరితహరం మొక్కలకు వేస్తున్నారు.
పంచాయతీ నిధులతో ట్రాక్టర్..
గ్రామంలో చెత్త సేకరణతో పాటు హరితహారంలో మొక్కలకు నీరు పోయడానికి పంచాయతీ నిధుల నుంచి రూ.5.40లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు చేశారు. ట్రాక్టర్ ద్వారా రోజూ ఉదయం గ్రామంలో చెత్తను సేకరిస్తారు. ట్యాంకర్ ద్వారా హరితహారంలో మొక్కలకు నీటిని అందజేస్తున్నారు.
సలహాలకు రైతువేదిక..
బోడకొండ క్లస్టర్ పరిధిలోని రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.28లక్షలతో రైతు వేదిక భవనాన్ని నిర్మించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండడమే కాకుండా సలహాలు సూచనలు అందించేందుకు వేదిక భవనం ఉపయోగపడుతుంది.