నల్లగొండ : ఈ నెల 14న జరుగనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముంబై నుంచి జిల్లా కేంద్రానికి బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. వీటిని నల్లగొండ నుంచి 12 జిల్లాలకు పంపించేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణకు హాజరైన ఆయా జిల్లాల ఏఆర్ఓలు బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల పేర్లు, నంబర్లు, ఇతర వివరాలను ఆర్వో నేతృత్వంలో క్షుణ్ణంగా పరిశీలించారు. అన్నివివరాలు పరిశీలించిన అనంతరం వీటిని ఆయా జిల్లాలకు పంపుతారు.