లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో నిర్మించనున్న జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, అలహాబాద్ హైకోర్టు కొత్త బిల్డింగ్ కాంప్లెక్స్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం శంకుస్థాపన చేశారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ రీటా బహుగుణ జోషి, రాష్ట్ర న్యాయ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజలకు సకాలంలో, చౌకగా న్యాయం అందించడం మన బాధ్యత అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ సందర్భంగా అన్నారు. మౌలిక సదుపాయాల కొరత వల్ల న్యాయవాదులు, క్లయింట్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. న్యాయం కోసం పేదలు ఎన్నో ఇబ్బందులు పడిన వైనాన్ని తాను చూశానన్నారు. సరైన మౌలిక సదుపాయాలు, న్యాయ నియామకాలు సకాలంలో న్యాయం అందేందుకు దోహదం చేస్తాయని చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ న్యాయ విశ్వవిద్యాలయాలను అధ్యయనం చేసిన తర్వాత రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.