న్యూఢిల్లీ: గర్భిణీ మహిళలకు కూడా ఇకపై కరోనా టీకా వేయనున్నారు. గర్భవతులు కొవిన్లో నమోదు చేసుకుని లేదా నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సినేషన్ పొందవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. గర్భవతులు, పుట్టబోయే పిల్లలకు కరోనా ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో గర్భిణీ మహిళలు కూడా తప్పని సరిగా కరోనా టీకాలు వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. గత నెల వరకు పాలిచ్చే తల్లులు మాత్రమే కరోనా టీకాకు అర్హులని పేర్కొన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా గర్భణీ మహిళలు కూడా వ్యాక్సినేషన్కు అర్హులేనని తెలిపింది. గర్భవతులకు కరోనా టీకా వేయడంపై సంబంధిత మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. గర్భిణీ మహిళలకు వ్యాక్సినేషన్ మంచిదేనని, వారికి తప్పని సరిగా టీకా వేయాలని అందులో పేర్కోంది.
ప్రస్తుత కరోనా వేరియంట్ల తీవ్రత నేపథ్యంలో వ్యాక్సినేషన్ నుంచి గర్భిణీ మహిళలను మినహాయించడం సరికాదని రోగ నిరోధకతపై జాతీయ సాంకేతిక సలహా బృందం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల గర్భవతులు కరోనా బారిన పడే ముప్పు తప్పుతుందని మే 28న జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. టీకాల వల్ల వాటిల్లే రిస్క్ కన్నా జరిగే మేలు ఎక్కువని ఆ కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో గర్భణీ మహిళలకు కరోనా టీకాకు సంబంధించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం జారీ చేసింది.