ఆదిలాబాద్ : గర్భంతో ఉన్న పులిని వేటగాళ్లు సజీవ దహనం చేశారు. ఈ దారుణమైన సంఘటన గత సోమవారం మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని పంధర్కావాడ తాలూకాలోని జారీ-జామ్నీ గ్రామాల సమీపంలో చోటుచేసుకుంది. గర్భిణీ పులిని కల్వర్టు లోపల లాక్ చేసి వేటగాళ్ళు సజీవ దహనం చేశారు. పులి గర్భంలో నాలుగు పిల్లలు ఉన్నట్లుగా సమాచారం. వేగిన్ అనే ఈ పులి ముందు పంజాలను వేటగాళ్ళు కత్తిరించుకుపోయారు.
నాలుగేళ్ల యవసున్నపులి సోమవారం ఉదయం కల్వర్టులో చనిపోయి ఉండటాన్ని ఓ అటవీ నివాసి గమనించాడు. దీంతో అధికారులకు సమాచారం అందివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇనుప చువ్వలను అమర్చడం ద్వారా కల్వర్టులోంచి పులి పారిపోకుండా చూశారు. అనంతరం నిప్పంటించి సజీవ దహనం చేశారు. అది చనిపోయిందా లేదా అని తెలుసుకునేందుకు పదునైన ఆయుధాలతో పొడిచి చూశారు.
చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత దాని పంజాలను తొలగించి తీసుకెళ్లారు. తాపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం (టీడబ్ల్యుఎస్)లో ఈ హత్య ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉండటంతో స్థానిక అటవీవాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. టీడబ్ల్యూఎస్కు చెందిన పెద్ద పులులు ఎక్కువగా కవ్వాల్ టైగర్ రిజర్వ్కు వలస వస్తుంటాయి. ఈ ఘటనపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ పులుల పరిరక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా అటవీ అధికారులను కోరుతున్నారు.