బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ‘అమీ తుమీ’ అన్నట్టు సాగుతున్నది. దేశంలోనే ఏకైక మహిళా సీఎం మమతా బెనర్జీకి, ప్రధాని మోదీకి మధ్య సాగుతున్న రాజకీయ సంగ్రామంగా ఈ ఎన్నికలను రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. వారం క్రితం కాలికి గాయమైన అంశాన్ని మమత సానుకూలంగా మల్చుకొని వీల్చైర్లో ప్రచారం చేస్తున్నారు. డాక్టర్లు రెండువారాలు బెడ్రెస్ట్ తీసుకోవాలని సూచించినా… తమ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్కిశోర్ సూచన మేరకే వీల్చైర్ ప్రచారాన్ని మమత ప్రారంభించారని సమాచారం. బెంగాల్ కదనరంగంలో ఈ ‘సైకలాజికల్ వ్యూహం’ బాగా పని చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మమతకు ప్రజల్లో, మీడియాలో లభిస్తున్న ప్రాధాన్యం దీనిని రుజువు చేస్తున్నది.
చక్రాల కుర్చీలో కూర్చునే మమత ప్రచారాన్ని కొనసాగించడం బెంగాలీలనే కాదు, యావత్ దేశప్రజలను ఆకర్షించింది. గాయం తర్వాత మమత సభలకు హాజరయ్యే ప్రజల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీదీ త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులతో పాటు, ప్రజలు కూడా ప్రార్థనలు, యజ్ఞాలు చేస్తున్నారంటే కాలి గాయం ఘటన ప్రజల్లోకి ఎంతగా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చని వాళ్లు పేర్కొంటున్నారు.
కుట్రలో భాగంగానే తనపై దాడి జరిగిందని దీదీ చెబుతుండగా, ప్రమాదవశాత్తే మమత కాలికి గాయమైనట్టు ఎన్నికల సంఘం దర్యాప్తు అనంతరం వెల్లడించింది. అయితే ఒక రాష్ట్ర సీఎం, అందునా మహిళకు ఇలాంటి ఘటన ఎదురవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రజల్లో సానుభూతిని కురిపించింది. సరిగ్గా ఈ అంశాన్ని పసిగట్టిన ప్రశాంత్ కిశోర్, మమతతో కలిసి వ్యూహానికి పదునుపెట్టారు. ‘వీల్చైర్లో బెంగాల్ బేటీ ప్రచారం’ అంటూ అందర్నీ ఆకర్షించారు. ఇది బాగా పనిచేసింది. తృణమూల్ పదేండ్ల పాలనలో అవినీతి, హింస గురించి విపక్షపార్టీలు లేవనెత్తుతున్నా.. మమత మాటలనే ప్రజలు ఆసక్తిగా వింటున్నారు. పార్టీ నేతలు వెళ్లిపోయినా.. గాయమైనా.. ఒంటరిగానే ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నట్లుగా మమత ఇమేజ్ ప్రజల్లో పెరుగుతున్నది. మొత్తమ్మీద గాయాన్ని ‘సైకలాజికల్ ప్రచారం’గా మార్చుకోవడంలో దీదీ, ప్రశాంత్ కిశోర్ విజయవంతమైనట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
మమతపై ప్రజల్లో సానుభూతి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఓటర్ల దృష్టిని మరల్చవద్దని ప్రశాంత్ కిశోర్.. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలను కూడా కొన్నిరోజులపాటు వాయిదా వేశారు. వారం క్రితమే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉండగా బుధవారం విడుదల చేశారు.
లాల్గఢ్: బీజేపీ జై శ్రీరాం అన్న నినాదానికి ఇచ్చిన ప్రాముఖ్యం ‘జై సీతారాం’ అనే మాటకు ఇవ్వదని, మహిళలపై ఆ పార్టీకి గౌరవం లేకపోవడమే అందుకు కారణం అని మమత ఆరోపించారు. కానీ రాముడు స్వయంగా దుర్గామాతను తనకన్నా గొప్పదిగా భావించి ఆమెకు పూజలు చేసేవాడన్నారు. ఎన్నికల్లో తన ను బయటకు రానీయకుండా ఉంచేం దుకు బీజేపీ దాడి చేయించిందని మమత ఆరోపించారు.
న్యూఢిల్లీ: పదేపదే పరోక్ష నిందారోపణలు చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) స్థాయిని తక్కువ చేయొద్దని మమతాకు ఈసీ స్పష్టంచేసింది. బీజేపీ, కేంద్రప్రభుత్వం చెప్పినట్టు ఈసీ వ్యవహరిస్తున్నదంటూ మమత చేస్తున్న ఆరోపణలు సరికాదని, ఎన్నికల సంఘం ఏ పార్టీకి ప్రతినిధి కాదని స్పష్టంచేసింది.