న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తన ఢిల్లీ నివాసంలో ఎనిమిది రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో భేటీ అయిన మరుసటి రోజే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో బుధవారం సమావేశమయ్యారు. పవార్, ప్రశాంత్ కిషోర్ల మధ్య 12 రోజుల్లో ఇది మూడవ భేటీ కావడం విశేషం నరేంద్ర మోదీ సర్కార్ను తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై ప్రధానంగా విపక్షాల భేటీలో చర్చించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేలా శరద్ పవార్ కసరత్తులో భాగంగానే వరుస సమావేశాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు.
మోదీ సర్కార్ను నిలువరించేందుకు థర్డ్ ఫ్రంట్ రూపకల్పనకూ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని ప్రచారం సాగుతుండగా బీజేపీని థర్డ్ ఫ్రంట్తో ఎదుర్కోలేరని ప్రశాంత్ కిషోర్ పేర్కొనడం గమనార్హం. ఇక పవార్ నివాసంలోమంగళవారం జరిగిన విపక్షాల భేటీ రొటీన్ సమావేశమేనని యశ్వంత్ సిన్హా స్ధాపించిన రాష్ట్రీయ మంచ్ సహా పలువురు భావసారూప్య నేతలతో ఈ సమావేశం జరిగిందని ఎన్సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక పవార్-ప్రశాంత్ కిషోర్ తాజా భేటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.