న్యూఢిల్లీ: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈనెలలో ఇరువురు రెండోసారి భేటీ కావడంతో వీరు బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నట్టు రాజకీయ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రశాంత్ కిషోర్ శరద పవార్ ల మధ్య జూన్ 12న ముంబైలోని పవార్ నివాసంలో జరిగిన తొలి సమావేశం మూడుగంటలకు పైగా సాగింది. ఇక తాజా భేటీలో పవార్, ప్రశాంత్ కిషోర్ లతో పాటు మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ ఆ పార్టీ ఎమ్మెల్యే, పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ పాల్గొన్నారు. అయితే పార్టీ సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.
ఇక ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ శరద్ పవార్ కు ఎలాంటి ప్రెజెంటేషన్ ఇవ్వలేదని సమాచారం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి బ్రేక్ వేస్తూ మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ఘన విజయం సాధించిన తీరు, దీదీ విజయానికి ఎలాంటి వ్యూహాలు ఉపకరించాయనే దానిపై భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. బెంగాల్ , తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ ల ఘన విజయంలో పదునైన ఎన్నికల, రాజకీయ వ్యూహాలతో ప్రశాంత్ కిషోర్ కీలక భూమిక పోషించారు. బెంగాల్ ఎన్నికల అనంతరం శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చొరవతో ప్రశాంత్ కిషోర్ పవార్ తో భేటీ అయ్యారు.