కోల్ కతా : పాలక టీఎంసీలో తాను చేరనున్నట్టు వచ్చిన వార్తలను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తోసిపుచ్చారు. తన స్నేహితుడు జితిన్ ప్రసాదలా తాను కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని, టీఎంసీ లేదా ఇతర పార్టీలో చేరతాననే ప్రచారం అవాస్తవమని తేల్చిచెప్పారు.
గతంలో ఎంపీగా పనిచేసిన ముఖర్జీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ చీఫ్ గానూ వ్యవహరించారు. జంగిపూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందిన ముఖర్జీ తాను టీఎంసీ భవన్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నానని ఈ సాయంత్రానికి కోల్ కతా చేరుకుని టీఎంసీలో చేరతానని వస్తున్న వార్తలు సత్యదూరమని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం టీఎంసీలో ఉన్న తన తండ్రి సహచరులే ఇలాంటి వదంతులకు కారణమని ముఖర్జీ పేర్కొన్నారు.