సిటీ సివిల్ కోర్టు, నాంపల్లి/ బంజారాహిల్స్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఆడుకునేందుకు బొమ్మలు ఇస్తానంటూ నాలుగేండ్ల బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన కేసులో కామాంధుడికి 20 ఏండ్ల జైలు శిక్ష పడింది. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో గత ఏడాది డిసెంబర్లో చోటు చేసుకున్న ఈ ఘటనపై నాలుగున్నర నెలల్లోనే నిందితుడికి జైలుశిక్ష పడింది. డీఐ హఫీజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం..నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం, మర్రిపల్లి గ్రామానికి చెందిన ఎనగంటి చెన్నయ్య(48) ఫిల్మ్నగర్లోని అంబేద్కర్నగర్లో నివాసం ఉంటూ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడి ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న బాలిక(4)ను గత ఏడాది డిసెంబర్ 11న బొమ్మలు ఇస్తానంటూ ఇంట్లోకి తీసుకువెళ్లి… లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.