మెదక్, ఏప్రిల్ 27 : మెదక్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు బాధ్యతలను సహకార, ఐకేపీ, మార్కెటింగ్ శాఖలకు అప్పగించారు. గత సీజన్లో కరోనా ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించగా, ఈ సారి కూడా అదే స్థాయిలో కొనుగోళ్లు జరిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ యాసంగింలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో జిల్లాలో ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగైంది. దీంతో దిగుబడి కూడా భారీగా పెరిగే అవకాశముంది. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు మొదలై 20 రోజులు కావస్తున్నది. మరికొన్ని చోట్ల ధాన్యం నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది 2.12 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తాన్ని 350 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి జిల్లాలోని మిల్లులకు తరలించనున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సేకరించిన వెంటనే లారీలలో లోడ్ చేసి మిల్లులకు పంపుతున్నారు. కేంద్రాలకు అనుగుణంగా గన్నీ సంచులు, ట్యాబ్స్,టార్ఫాలీన్లు, కాంటాలు, లారీలను సమకూర్చనున్నారు. ఇదిలావుండగా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సౌకర్యంతో పాటు నీడను కూడా కల్పించనున్నారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 3035 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రూ.57 లక్షల 30వేలు రైతు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇదిలా ఉండగా, గతేడాది 320 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా, ఈ యాసంగిలో 350 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 301 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మరో రెండు, మూడు రోజుల్లో మిగతా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 236, ఐకేపీ 110, మార్కెటింగ్ 4 మొత్తం 350 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
రైతులు ఆరుగాలం పండించిన ధాన్యం దళారులకు విక్రయించి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించేలా రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ ధాన్యానికి రూ.1888, సాధారణ గ్రేడ్ ధాన్యానికి రూ.1868 పొందాలని అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి డబ్బులు 72 గంటల్లోనే నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొంటున్నారు. అయితే కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ధాన్యంలో నాణ్యత, మాయిశ్చర్, తాలు నిబంధనలు తెలియజేస్తున్నారు.
మెదక్ జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందులో ఇప్పటి వరకు సహకార, ఐకేపీ, మార్కెటింగ్ శాఖల ద్వారా 301 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. మరో రెండు, మూడు రోజుల్లో మిగతా కేంద్రాలను తెరుస్తాం. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గన్నీ బస్తాలు, లారీలు అందుబాటులో ఉంచుతున్నాం. దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని తరలించేలా రైతులు చూడాలి. 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. – శ్రీనివాస్, డిసీఎస్వో మెదక్