ముషీరాబాద్, ఏప్రిల్ 23: రాజకీ లబ్ధి కోసం అభివృద్ధి పనులకు ఎవరు అడ్డుపడినా సహించేది లేదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ హెచ్చరించారు. ముషీరాబాద్ డివిజన్ అదర్శనగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, ఎవరూ అడ్డు చెప్పినా పనులు ఆపేది లేదన్నారు. శుక్రవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ఆదర్శనగర్ కాలనీలో పర్యటించి త్వరలో చేపట్టనున్న పైపులైన్ పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ పార్టీ నాయకుడు పైపులైన్ పనులు తమ ఇంటి వరకు చేపట్టవద్దంటూ అభ్యంతరం చెప్పడంతో ఎమ్మెల్యే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకరి కోసం వందల మంది ఇబ్బంది పడుతున్న డ్రైనేజీ పైపులైన్ పనులను నిలిపివేసి మరోచోట చేపట్టడం సాధ్యం కాదని, పనులను అడ్డుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. మరికొన్ని రోజులు డ్రైనేజీ పైపులైన్ పనులు చేపట్టి దశాబ్దాల కాలంగా ఎదురవుతున్న మురుగు నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. పనులు పూర్తయ్యే వరకు స్థానికులు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం మహేశ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, మాధవ్, మల్లేశ్యాదవ్, రజినీ, నేత శ్రీనివాస్, నాగులు, శ్రీధర్రెడ్డి, శ్యామ్, లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.