అవగాహనతోనే క్యాన్సర్ను జయించొచ్చని అపోలో క్యాన్సర్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి.విజయ్ కరణ్ రెడ్డి అన్నారు. ఆస్పత్రిలో మంగళవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏదాదికి లక్షకు మించి క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని వివరించారు. సగటున ఏడాదికి 50 వేల మంది మరణిస్తున్నారని ఆయన తెలిపారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ను గుర్తించొచ్చని తెలిపారు. అదే ఆసుపత్రిలో జరిగిన మరో కార్యక్రమంలో గుండెపోటు సంభవించిన సందర్భంలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే దమనులలో అడ్డంకిగా ఏర్పడుతుందని, దానిని వీలైనంత తొందరగా తొలిగిస్తే ముప్పు తప్పుతుందని కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ అన్నారు. డోర్ టూ బెలూన్ సమయాన్ని కుదిస్తే ముప్పు తక్కువని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియకు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం, 90 నిమిషాల వ్యవధి ఉండగా, దానిని అపోలోలో 60 నిమిషాల లోపు పూర్తి చేయాలని నేడు జరిగిన సమావేశంలో చర్చించి తీర్మానించారు. ఈ ప్రక్రియ ద్వారా వ్యక్తి ప్రాణాలు రక్షించొచ్చని వివవరించారు.