కరోనా వ్యాప్తి సమయంలో ప్రజలకు ధైర్యం కల్పిస్తూ అండగా ఉండాల్సింది పోయి తప్పుడు రాతలతో ‘ఆంధ్రజ్యోతి పత్రిక’ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని గాంధీ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ గాంధీలో వివిధ అనారోగ్య కారణాల వల్ల 20 సాధారణ మరణాలు సంభవిస్తుంటాయని, మరణాలన్నింటినీ కరోనా ఖాతాలో వేస్తే ఎలాగని గాంధీ వర్గాలు మండిపడ్డాయి. ఎంతో మంది రోగులకు ప్రాణం పోస్తున్న గాంధీ దవాఖానపై తప్పుడు వార్తా కథనాలను ప్రచురించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం గాంధీ దవాఖానలో 500పడకలు ఉండగా అందులో 300పడకలను ఐసీయూవార్డుకు, 200పడకలను సాధారణ కొవిడ్ రోగులకు కేటాయించారు. గాంధీతో పాటు నగరంలోని టిమ్స్, కింగ్కోఠి, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, అమీర్పేట ప్రకృతి చికిత్సాలయం, ఎర్రగడ్డ ఆయుర్వేద దవాఖాన తదితర ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ చికిత్సా వార్డులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితి విషమించిన రోగులను గాంధీకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో చాలా వరకు ప్రైవేటు దవాఖానల నుంచి ఆఖరి క్షణాల్లో కేసులను గాంధీకి పంపిస్తున్నారు. పరిస్థితి విషమించినా కాదనకుండా గాంధీ వైద్యులు సదురు రోగులకు చికిత్స అందిస్తూ వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణించకుండా డెత్ అనలైజేషన్ చేయకుండానే గాంధీలో జరిగినవన్నీ కరోనా మరణాలుగా చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదంటున్నారు గాంధీ వైద్యులు.
ప్రస్తుతం వివిధ అనారోగ్య సమస్యల వల్ల నాన్కొవిడ్ కేసుల్లో మరణాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ సాధారణ మరణాలే 20కి పైగా సంభవిస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్య ట్రామా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ రెండు కలిపే ప్రతిరోజూ 20నుంచి 30మరణాలు జరుగుతున్నాయి. ఈ విషయాలను పరిశీలిస్తే అన్నింటినీ కరోనా మరణాలుగా పరిగణించలేం. వాటిని విశ్లేషించాల్సి ఉంటుంది. దానికి ఒక ప్రత్యేక కమిటీ ఉంటుంది. మరణించిన రోగి ఏ కారణం చేత అంటే కేవలం కరోనా రావడం వల్ల అనారోగ్యానికి గురై మృతి చెందాడా లేకా ఇతర అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందాడా అనే విషయాన్ని విశ్లేషణ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారిస్తుంది. కొంతమంది అవేవి చూడకుండా ఇష్టమొచ్చినట్లు కరోనా మరణాలపై తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేయడం సరైంది కాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన