ముంబై: కరీబియన్ దీవుల్లోని డొమినికా జైలులో ఉన్న మెహుల్ చోక్సీని తీసుకువచ్చేందుకు ఎనిమిది మంది సభ్యుల బృందం ఆ దేశానికి ప్రత్యేక విమానంలో వెళ్లింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు సుమారు 13500 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నీరవ్ మోదీతో పాటు చోక్సీ కోసం భారత్ వేంటాడుతున్నది. అయితే ఆంటిగ్వా నుంచి క్యూబాకు పారిపోతున్న సమయలో చోక్సీని అరెస్టు చేశారు. రేపు కోర్టు విచారణ వేళ డొమినికన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు భారతీయ బృందం కేసు పూర్వోపరాలు వివరించనున్నది. డొమినికా వెళ్లిన బృందంలో సీబీఐ, ఈడీ, సీఆర్పీఎఫ్లకు చెందిన ఇద్దరేసి సభ్యులు ఉన్నారు. వీళ్లంతా మిషన్ చోక్సీలో భాగంగా అక్కడకు వెళ్లారు.
సీబీఐకి చెందిన బ్యాంకింగ్ ఫ్రాడ్స్ చీఫ్గా శారదా రౌత్ ఉన్నారు. ఆమే ఈ మిషన్కు చీఫ్గా వెళ్లారు. అయితే పీఎన్బీ కేసును విచారిస్తున్న వ్యక్తుల్లో ఆమె కీలకమైన ఆఫీసర్. ఒకవేళ అన్నీ అనుకున్నట్లే జరిగితే అప్పుడు ఈ బృందమే వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని వెనక్కి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే అతన్ని అరెస్టు చేయనున్నారు. డొమినికాలో 62 ఏళ్ల చోక్సీ అరెస్టు అయిన తీరు పట్ల అక్కడ కొంత వివాదం చెలరేగుతున్నది. డొమినికాలో పౌరసత్వం ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను ప్రధాని రూజ్వెల్ట్ స్కీరిట్ దెబ్బతీస్తున్నారని ఇప్పటికే అక్కడి ప్రతిపక్ష నేత లెన్సాక్స్ లింటన్ ఆరోపించారు.