హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రికెట్ అభ్యున్నతికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అద్భుత ప్రతిభ కల్గిన గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కవిత సూచించారు. సోమవారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)ఎగ్జిక్యూటివ్ మాజీ సభ్యుడు, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి చాతిరి బాబురావు.. కవితను ఆమె నివాసంలో కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సత్తాచాటగల క్రికెటర్లను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే విధంగా
శిక్షణనివ్వాలని కవిత పేర్కొన్నారు. హెచ్సీఏ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాల్లో క్రికెట్ను మరింత అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.