పాట్నా : కొవిడ్ విజృంభన నేపథ్యంలో పెండ్లిళ్లు, ఇతర సామూహిక కార్యాక్రమాలను వాయిదా వేసుకోవాల్సిందిగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 10 రోజుల లాక్డౌన్ ప్రకటన వెలువడిన మరుసటి రోజే సీఎం స్పందిస్తూ ఈ చర్య ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చైన్ను బ్రేక్ చేయొచ్చన్నారు. కరోనా మహమ్మారి నుండి ప్రజల సంరక్షణార్థం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. దయచేసి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందిగా కోరారు.
లాక్డౌన్ విషయంలో ఒకవేళ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని పాట్నా హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటన చేసింది. లాక్డౌన్ నిబంధనలు అనుసరించి వివాహాలకు 50 మందికి మించి అతిథులు హాజరుకావడానికి వీలులేదు. అదేవిధంగా అంత్యక్రియల్లో 20కి మించి పాల్గొనరాదు. కిరాణా దుకాణాలు సైతం ప్రతిరోజు నాలుగు గంటలు మాత్రమే తెరిచేందుకు అనుమతించారు. ఉదయం 7 నుండి 11 గంటల మధ్య మాత్రమే దుకాణాలు కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతి. బిహార్లో ప్రతీరోజు 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.