కామారెడ్డి టౌన్, మే 13: మిల్లుల వారీగా ఏ రోజుకారోజు వ్యవసాయ, రెవెన్యూ, సహకార శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలు రాకుండా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్ చేయించాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. ఆయన ఆర్డీవోలు, ఏడీఏలు, సహకార శాఖ సూపర్వైజర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో మండలాల వారీగా ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లుల ప్రకారం కేటాయించిన అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎలాంటి పెండింగ్ లేకుండా, సమస్య లు రాకుండా చూడాలన్నారు.ఏ మిల్లుకు ఎంత అలాట్ అయ్యింది, రోజువారీ సాధించిన లక్ష్యం వివరాలను ప్రతిరోజూ సమర్పించాలని ఆదేశించారు. అన్లోడింగ్ సమస్యలు ఉన్న మిల్లుల వద్ద అదనపు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హమాలీలు, ట్రాన్స్పోర్టు లారీల సమస్యలు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. అవసరమైన చోట ట్రాక్టర్లను, లారీలను అదనంగా ఉపయోగించుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలులో ట్యాబ్ ఎంట్రీ చాలా ముఖ్యమని, ట్యాబ్ ఎంట్రీ 85 శాతం తగ్గకుండా చూసుకోవాలని, దీంతో రైతులకు సకాలంలో డబ్బులు జమ చేస్తామని, రైతులకు ఆర్థిక బలం చేకూరుతుందని తెలిపారు. ట్యాబ్ ఎంట్రీలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డీవో శ్రీను, జిల్లా సహకార శాఖ అధికారిణి వసంత, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల అధికారి కొండల్రావు పాల్గొన్నారు.