చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పతాకస్థాయికి చేరాయి. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పార్టీ నేత నవజోత్ సింగ్ సిద్ధూల మధ్య కుమ్ములాటలు మరింత ముదిరాయి. సీఎంపై అసమ్మతి బావుటా ఎగురవేస్తున్న సిద్ధూ తన కార్యక్షేత్రాన్నిఅమృత్సర్ నుంచి కెప్టెన్ సింగ్ స్వస్థలం పటియాలాకు మార్చడం ఆసక్తి రేపుతోంది. సిద్దూ పోస్టర్లు పటియాలా లో వెలుగుచూడటం కలకలం రేపగా సీఎం అమరీందర్ సింగ్ పోస్టర్లు అమృత్సర్ ఈస్ట్ లో దర్శనమివ్వడంతో ఇరువురు నేతల మధ్య పోస్టర్ వార్ పార్టీ వర్గాల్లో దుమారం రేపింది.
మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ, జలంధర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ 2015లో అమరీందర్ సింగ్ పై అసమ్మతి కుంపటిని రగిలించారు. పంజాబ్ లో నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి పెంచుతున్నారు. ఇక తాజా పోస్టర్ వార్ నేపథ్యంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమై పంజాబ్ పార్టీ నేతల మధ్య సఖ్యత కోసం చర్చలు జరిపింది. ఇక రాజీ ఫార్ములాలో భాగంగా ఇరువురు నేతల మధ్య సఖ్యత కుదిర్చే క్రమంలో సిద్ధూకు ఉప ముఖ్యమంత్రి కట్టబెట్టాలని కమిటీ పార్టీ హైకమాండ్ కు సిఫార్సు చేయవచ్చని తెలుస్తోంది.