కోటగిరి/ఇందల్వాయి/ఆర్మూర్, జూలై 11 : జనాభా నియంత్రణ అందరి బాధ్యత అని వైద్యారోగ్య అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కోటగిరి, ఇందల్వాయి మండలకేంద్రాలతోపాటు ఆర్మూర్ పట్టణంలో వైద్యారోగ్య సిబ్బంది వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో కోటగిరిలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సదర్భంగా సర్పంచ్ పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ జనాభా నియంత్రణ అందరి బాధ్యత అని అన్నారు. జనాభా పెరుగుదల రేటు 1.7 నుంచి 1 శాతానికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సూపర్వైజర్లు కృష్ణవేణి, జ్యోతి, సాయికుమారి, మైనార్టీ నాయకులు జుబేర్, బాబుఖాన్, నజీర్, జలాల్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండల కేంద్రంలో ఆరోగ్య విస్తీర్ణాధికారి వై.శంకర్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆరోగ్య, ఆశ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. జనాభా పెరుగుదలతో కలిగే ఇబ్బందులు, కుటుంబ నియంత్రణ తాత్కాలిక, శాశ్వత పద్ధతులపై ఆరోగ్య విస్తీర్ణాధికారి శంకర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య బోధకులు మనోహర్, అరుంధతి, ఇందిర, ఉదయ, భానుప్రియ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.ఆర్మూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, పెర్కిట్లో ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వైద్యాధికారులు మాట్లాడుతూ.. అధిక జనాభాతో ఇబ్బందులు తప్పవని, దంపతులు జనాభా నియంత్రణ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఆయేషా ఫిర్దోస్, హెల్త్ సూపర్వైజర్లు చంద్రశేఖర్, అనురాధ, సిబ్బంది పాల్గొన్నారు. పెర్కిట్లో పీహెచ్ఎన్ స్వరూప, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.