జైపూర్ : కరోనా మహమ్మారి వ్యాప్తితో అన్ని వర్గాలు ప్రభావితం కాగా వయో వృద్ధుల్లో మాత్రం భవిష్యత్పై ఆశలనూ కొవిడ్-19 చిదిమివేసింది. మెరుగైన రేపటి రోజును చూస్తామనే ఆశ తమలో ఏమాత్రం లేదని కొవిడ్ అనంతర సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది వృద్ధులు పేర్కొన్నారు. కొవిడ్-19 మహమ్మారి వృద్ధులకు ఎన్నో సవాళ్లు విసిరింది. సామాజిక దూరం పాటించాల్సిన పరిస్ధితి నుంచి ఆర్ధిక ఇబ్బందులు, మానసిక సమస్యలు చుట్టుముట్టడం, కుటుంబ సభ్యుల నిరాదరణ వరకూ ఎన్నో కడగండ్లను కరోనా మహమ్మారి మిగల్చింది. కొవిడ్-19తో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలపై నియంత్రణలు, సహా ఆర్ధిక త్తిళ్లూ వృద్ధులను కుంగదీశాయని ఈ సర్వేలో వెల్లడైంది.
కరోనా మహమ్మారి వృద్ధుల దైనందిన జీవితంతో పాటు వారి జీవన నాణ్యతా ప్రమాణాలనూ దెబ్బతీసిందని ఈ సర్వే చేపట్టిన ఏజ్వెల్ ఫౌండేషన్ చీఫ్ హిమాన్షు రధ్ తెలిపారు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోని వృద్ధులపై మహమ్మారి ఎలాంటి ప్రభావం చూపిందని తెలుసుకునేందుకు ఏజ్వెల్ ఫౌండేషన్కు చెందిన వాలంటీర్లు ఈ ఏడాది జులైలో 1500 మంది వృద్ధులను పలకరించారు.
కొవిడ్-19తో తమపై ప్రతికూల ప్రభావం పడిందని 89.5 శాతం మంది పురుషులు వెల్లడించగా, 86.3 శాతం మంది మహిళలు తెలిపారు. హెల్త్కేర్ విషయంలో తాము ఇబ్బందులు ఎదుర్కొన్నామని 28.9 శాతం మంది వృద్ధులు పేర్కొనగా మానసిక పరిస్ధితులే బాధించాయని 24.2 శాతం మంది వెల్లడించారు. సామాజికాంశాలు తమకు ప్రతికూలంగా మారాయని 22.7 శాతం మంది వృద్ధులు తెలిపారు. కొవిడ్-19 రూపంలో ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయని 21.7 శాతం మంది వెల్లడించారు.