న్యూఢిల్లీ, మార్చి 16: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తరఫున పని చేసే లెఫ్టినెంట్ గవర్నర్కు (ఎల్జీకి), ప్రజల ఓట్లతో ఎన్నికైన రాష్ట్రప్రభుత్వానికి మధ్య మరోమారు చిచ్చు రగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీపై ఎల్జీ, రాష్ట్రసర్కార్లలో ఎవరికి కీలక అధికారాలన్న వివాదం.. కేంద్రం తీసుకొచ్చిన తాజా బిల్లుతో మరింత ముదిరేలా ఉంది. ఢిల్లీ పాలనాధికారాలకు సంబంధించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’ (జీఎన్సీటీడీ) చట్టంలో సవరణలను ప్రతిపాదిస్తూ ఒక బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సవరణల వల్ల ఇప్పటికే తమకున్న పరిమితస్థాయి అధికారాలు కూడా లేకుండా పోతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. ఢిల్లీలో ప్రజాప్రభుత్వం అధికారాలకు కత్తెర వేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రే ఈ సవరణలని ఆప్ నాయకులు మండిపడుతున్నారు. ఈ మేరకు ఈ బిల్లుపై కేజ్రీవాల్ నాయకత్వంలో ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపనున్నారు.
కేంద్ర ప్రభుత్వం చేయనున్న సవరణలు అప్రజాస్వామికమే కాక హానికరమైనవి కూడా అని కాంగ్రెస్ నేత పి చిదంబరం విమర్శించారు. ఈ మార్పులతో ఢిల్లీ ప్రభుత్వ స్థాయి ఓ మున్సిపాలిటీ కన్నా తక్కువైపోతుందని చెప్పారు. ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం నియమించే లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అపరిమిత అధికారాలతో వైస్రాయ్గా మారుతారన్నారు. తన ప్రభువు (కేంద్రం) అభీష్టం ప్రకారం ఎల్జీ తన అధికారాలను ఉపయోగిస్తారని చెప్పారు.