ముంబై : ప్రాణప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళ పట్ల పోలీసులు మానవత్వం చాటి ప్రాణాలు కాపాడారు. మహారాష్ర్టలోని ఖండలా, కార్జత్ మధ్యన ఉన్న పశ్చిమ కనుమల్లో రైల్వే ట్రాక్ను దాటుతుండగా.. ఓ మహిళను రైలు ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. మహిళను గమనించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మహిళను చూసి చలించిపోయారు.
అక్కడ్నుంచి ఆస్పత్రికి తరలిద్దామంటే అంబులెన్స్ సౌకర్యం లేదు. చేసేదేమీ లేక కర్రలతో ఓ స్ర్టెచర్ను తయారు చేశారు. దానిపై క్షతగాత్రురాలిని పడుకోబెట్టి సుమారు 4 కిలోమీటర్లు మోసుకెళ్లారు. పలాస్దారి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే అంబులెన్స్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పుణెకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలిని ఆశా వాఘమేర్(42)గా పోలీసులు గుర్తించారు. కార్జత్ కొండల్లోని ఓ కుగ్రామంలో మహిళ నివసిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే మహిళను 4 కిలోమీటర్లు మోసుకెళ్లిన పోలీసులపై ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపించారు.