న్యూఢిల్లీ: సాధారణంగా సినిమాల్లో స్పైడర్ మ్యాన్ పెద్ద పెద్ద భవంతులను అలవోకగా ఎక్కుతూ ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడి అందరి ప్రశంసలు పొందుతాడు. ఇలాంటి సాహసాలు సినిమాల్లో సహజమే అయినా రియాలిటీలో మాత్రం అస్సలు సాధ్యం కాదు.
కానీ, దక్షిణ ఢిల్లీకి చెందిన ఇద్దరు పోలీసులు నిజ జీవితంలో ఇలాంటి సాహసాన్నే చేశారు. ప్రస్తుతం వారి సాహసానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో నెటిజన్లు రియల్ స్పైడర్మ్యాన్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-1 ఏరియాలో ఓ భవనం రెండో అంతస్తులో ఈ ఉదయం 6.55 గంటలకు మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఒకవైపు మంటలు ఆర్పుతూనే బిల్డింగ్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తరలించారు. కానీ చివరికి ముగ్గురు బాధితులు మిగిలిపోయారు. వారిని రక్షించడం పోలీసులకు క్లిష్ట సమస్యగా మారింది. ఎందుకంటే మంటల కారణంగా మెట్ల మార్గంలో వారిని చేరుకోవడం సాధ్యం కాలేదు.
దాంతో వారు బయటికి రావడానికి ఏ మార్గం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో పోలీసులు వారికి భయపడవద్దని ధైర్యం చెప్పారు. వారిలో ఇద్దరు పోలీసులు ప్రాణాలకు తెగించి బిల్డింగ్కు ఉన్న ఇనుప గ్రిల్స్ సాయంతో పైకి ఎక్కారు.
వారిలో ఒక పోలీసు ఇంట్లోకి చేరుకుని బాధితులను క్షేమంగా బయటకు తీసుకువచ్చాడు. పోలీసులు ఇలా సాహసం చేసిన కాపాడిన ముగ్గురిలో 87 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతుండటంతో పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.