యూపీ ఠాణాలో మహిళ ఆత్మహత్య
లక్నో, అక్టోబర్ 9: ఉత్తరప్రదేశ్లో ఓ మహిళా బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నది. తనపై లైంగికదాడి జరిగిందని ఆమె ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోవడంతో క్షోభకు గురై శనివారం ఆజంగఢ్ ఠాణాలో పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. అప్పుడు కానీ పోలీసులు మొద్దునిద్ర వీడలేదు. రేప్ కేసు నమోదుచేసి, కంటితుడుపుగా ఎస్హెచ్వోను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. లైంగికదాడి చేసిన వ్యక్తిని తన భార్య గుర్తించినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదని ఆమె భర్త విలపించాడు. ఎన్నిసార్లు ఠాణా చుట్టూ తిరిగినా, న్యాయం చేయమని ప్రాధేయపడినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. ఈ ఘటన బీజేపీ ప్రభుత్వానికి చెంపదెబ్బ అని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.