వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేసి, బాధితులకు ఉచితంగా మందులను అందజేస్తున్నారు. ఐదేళ్లుగా బాధితుల సంఖ్య అదుపులోనే ఉన్నదని జిల్లా క్షయ నిర్మూలన అధికారి కార్తిక్ తెలిపారు. 2016లో 754 మంది, 2017లో 692, 2018లో 1087, 2019లో 1130, 2020లో 20 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా వ్యాధిని గుర్తించేందుకు జిల్లాలో 23 డిజిటల్ మైక్రో సెంటర్లను ఏర్పాటు చేశారు. వాటిని జిల్లా కేంద్రంలోని, బైంసా, ఖానాపూర్, ముథోల్తో పాటు ఆయా పీహెచ్సీల్లో కొనసాగిస్తున్నారు. లక్షణాలున్న వారికి తెమడ పరీక్ష చేసి, నిర్దారణ అయితే ప్రభుత్వం ద్వారా ఉచితంగా మందులు అందజేస్తున్నారు.
నిర్మూలనకు టీబీ క్లబ్ల ఏర్పాటు..
క్షయ నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో టీబీ క్లబ్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా నోడల్ అధికారిగా వైద్యుడు కార్తిక్ ఆధ్వర్యంలో ఇప్పటికే వ్యా ధికి గురైన వారి గ్రామాలను గుర్తించిన అధికారులు స్థానికంగా బాధితులతో క్లబ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో ప్రతి నెలా ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. ఊపిరితిత్తులపై ఈ వైరస్ తీవ్రత ఉంటుంది. దగ్గు, జ్వరం, ఊపిరితిత్తుల్లో నొప్పి ఉండి దమ్ము వచ్చిన వారిని గుర్తించి పరీక్షా కేంద్రాలకు పంపిస్తున్నారు. డిజిటల్ మైక్రో సెంటర్లో పరీక్షలు చేసి, నిర్ధారణ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు అందిస్తున్నారు. ఆయా గ్రామాల్లో బాధితుల సంఖ్యకు అనుకూలంగా క్లబ్లను ఏర్పాటు చేసి, ప్రతి నెలా మందులు వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయవద్దని, జన సమూహాల్లో దగ్గవద్దని సూచిస్తున్నారు. అలాగే బాధితులకు ప్రతి నెలా రూ.500 పోషణ భత్యం అందజేస్తున్నారు. కాగా, ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మాస్క్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సెల్ఫీ ఫొటో దిగి వ్యాధి నివారణ ప్రాధాన్యతను తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.