రాంచీ : హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సహకరిస్తే పెద్దమొత్తంలో నగదు, మంత్రిపదవిని ఆఫర్ చేస్తామని తనను సంప్రదించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నమన్ బిక్సల్ కొంగరి ఆరోపించారు. ఈ కుట్ర వెనుక బీజేపీ హస్తం ఉందని తనను ప్రలోభాలకు గురిచేసిన వారు వెల్లడించారని చెప్పారు. జార్ఖండ్లో జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్తో కూడిన సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి తమను కొందరు సంప్రదిస్తున్నారని వ్యాపారుల పేర్ల చెబుతూ కాషాయపార్టీ ప్రోద్బలంతో తాము ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తనకు మంత్రిపదవితో పాటు రూ కోట్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు.
జార్ఖండ్లో సొరేన్ సర్కార్ను కూల్చేందుకు కుట్ర జరిపారనే ఆరోపణలపై రాంచీ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలీసుల ఎదుట సంచలన విషయాలు వెల్లడించారు. బెర్మో ఎమ్మెల్యే కుమార్ జైమంగళ్ ఫిర్యాదుపై పోలీసులు ఈ అరెస్ట్లు చేపట్టారు. జేఎంఎం-కాంగ్రెస్,ఆర్జేడీ సర్కార్ను అస్ధిరపరిచేందుకు కొన్ని శక్తులు కుట్రపన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాంచీ పోలీసులు పలు హోటళ్లపై దాడులు చేశారు.
అభిషేక్ కుమార్ దూబే, అమిత్ సింగ్, ఎన్పీ మహతో అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాగా ఈ వ్యవహారంపై పోలీసులు భయోత్పాతం సృష్టిస్తున్నారని, అరెస్ట్ చేసిన వారు పండ్లు, కూరగయాలు అమ్ముకునే వ్యక్తులని మాజీ సీఎం బాబూలాల్ మరాండీ అన్నారు. ఈ వ్యవహారంపై జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.