హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభు త్వం నిర్మిస్తున్న ఆదివాసీ, బంజారా భవనాల పనులు తుది దశకు చేరుకున్నాయి. ఒక్కో భవనాన్ని సువిశాలంగా ఎకరం స్థలంలో రూ.20 కోట్లతో చేపడుతున్నారు. రెండు భవనాలను రెండు ఎకరాల్లో రూ.40 కోట్లతో నిర్మిస్తున్నారు. వచ్చేనెల రెండోవారంలో పనులు పూర్తిచేయాలని గిరిజన సంక్షేమశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. గడువులోగా పూర్తిచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించాలని సమాయత్తం అవుతున్నది. రాష్ట్రంలో నలుమూలల నుంచి ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతిని ప్రదర్శించేందుకు, సభలు, సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించుకునేందుకు, వారి ఆత్మగౌరవ ప్రతీకగా ఈ భవనాలు నిలువాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ వీటి నిర్మాణాలు చేపడుతున్నారు. దేశంలోని అనేక రాష్ర్టాల్లో కనీసం రాష్ర్టానికో ఆదివాసీ/గిరిజన భవనం లేదా మ్యూజియం మాత్రమే ఉంటే.. తెలంగాణలో మాత్రం ఆరు (నాలుగు ఐటీడీఏల్లో నాలుగు, మేడారం, అకోక్నగర్లో ఒక్కొక్కటి చొప్పున) గిరిజన మ్యూజియాలు ఉన్నాయని ఆదివాసీ, గిరిజన మేధావులు పేర్కొంటున్నారు. వీటితోపాటు బంజారాహిల్స్లో ఆదివాసీ, బంజారా భవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామని గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ సీఈ ఎం శంకర్ తెలిపారు. ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తయ్యాయని, వచ్చేనెల రెండోవారంలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
రెండు సంస్కృతుల సమ్మేళనం
ఆదివాసీ, బంజారా రెండు వేర్వేరు తెగలు. వీరి సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేకమైనవి. ఆదిమ గిరిజన తెగలు, మైదాన గిరిజన తెగలుగా దేశంలో ప్రత్యేకతను సొంతం చేసుకున్నాయి. ప్రభుత్వం నిర్మిస్తున్న ఆదివాసీ భవన్లో ఆదివాసీ తెగలు కోయ, గోండు, నాయక్పోడ్, పర్దాన్ తెగలది ప్రత్యేక అటవీ సంస్కృతి. బంజారాలది మరో విశిష్ట సంస్కృతి. రెండు భవనాల్లోనూ ఆయా సంస్కృతులు ఉట్టిపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివాసీ భవన్లోకి వెళ్లగానే అటవీ సంస్కృతి, వారి జీవనవిధానం ఉట్టిపడేలా.. బంజారాభవన్లోకి అడుగుపెట్టగానే వారి సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లుచేశారు. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ.17.5 లక్షల చొప్పున మొత్తం రూ.35 లక్షలు ఆర్ట్వర్క్కు కేటాయించటం అసాధారణ విషయమని రాష్ట్ర మ్యూజియం క్యూరేటర్ ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు.
తెలంగాణలోనే ప్రాధాన్యం
రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర జనాభాలో 5 శాతానికి మించి గిరిజనులు ఉంటే ఆ రాష్ర్టాన్ని గిరిజన రాష్ట్రంగా పరిగణిస్తారు. మన రాష్ట్రంలో గిరిజన జనాభా 9.5 శాతం ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెప్తున్నాయి. అనేకరాష్ర్టాల్లో 12 నుంచి 40 శాతం గిరిజన ఉన్నది. ఆయా రాష్ర్టాల్లో సైతం ఆదివాసీ, గిరిజన సంస్కృతులకు తెలంగాణలో ఇచ్చింత ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఆదివాసీ, గిరిజన మేధావులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు దేశంలో మధ్యప్రదేశ్ మాత్రమే ఆదివాసీ, గిరిజనులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పేవారు. ఆ రాష్ట్రం భోపాల్లో ‘భారత్ భవన్’ నిర్మించినప్పటికీ మ్యూజియంగా నిలిచిపోయింది.
దేశంలోని అనేక రాష్ర్టాల్లో కనీసం రాష్ర్టానికో ఆదివాసీ/గిరిజన భవనాలు లేదా మ్యూజియమే ఉంటే, తెలంగాణలో ఆరు (నాలుగు ఐటీడీఏల్లో, మేడారం, అకోక్నగర్లో ఒక్కొక్కటి చొప్పున) గిరిజన మ్యూజియంలున్నాయి. బంజారాహిల్స్లో ఆదివాసీ, బంజారా భవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఎకరం స్థలం. నాలుగు అంతస్థులు. ఒకేసారి 1,200 (బాల్కనీలో 200 మందిసహా) మంది కూర్చునేలా అధునాతన ఆడిటోరియం. 1,500 మంది ఒకేసారి భోజనాలు చేసేందుకు సువిశాల డైనింగ్హాల్. వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేక డైనింగ్లు. కిచెన్, హాల్, గ్రంథాలయం, సందర్శకుల కోసం హాల్, వీఐపీ, వీవీఐపీలకు వేర్వేరుగా సూట్ రూంలు.
ఒకేసారి 120- 150 కార్లు పార్కు చేసేందుకు అనువైన స్థలం.. ఇవన్నీ ఏవో కార్పొరేట్స్థాయి భవనాల్లో సదుపాయాలు కాదు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఆదివాసీ, బంజారా భవనాల్లోని ప్రత్యేకతలు. వచ్చేనెల రెండోవారంలో పూర్తే లక్ష్యంగా ఈ భవనాలు గిరిజన సంస్కృతులు ఉట్టిపడేలా తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.