న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తౌక్తే తుఫాన్పై శనివారం సమీక్షించారు. తుఫాన్ ప్రభావం చూపే రాష్ట్రాలు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, సంస్థలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తుఫాన్ వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడం, సన్నద్ధతపై వారితో చర్చించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన వీడియో సమావేశం జరిగిందని, తీరప్రాంత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలతో కేబినెట్ కార్యదర్శి నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ప్రధాని కార్యాలయం తెలిపింది. తుఫాన్ పరిస్థితిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 24 గంటలూ సమీక్షిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నదని పీఎంవో వెల్లడించింది.