సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ప్రసాదరావుకు ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పిరావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రసాదరావుకు భార్య సౌమిని, కుమారుడు వికాస్, కుమార్తె సౌమ్య, మనవడు ఉన్నారు. 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రసాదరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ. తెలంగాణలో కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా అనంతరం విశాఖ ఎస్పీగాను పనిచేశారు. విజిలెన్స్ సెల్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా, విశాఖ, భోపాల్లో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ కమాండెంట్గా, కర్నూలు రేంజ్ డీఐజీగా, ఏసీబీ డీజీగా, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ఇంచార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ అనే పుస్తకం రాశారు. 1997లో భారత పోలీస్ పతకం, 2006లో రాష్ట్రపతి పోలీస్ పతకం అందుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రసాదరావు ఏపీకి కేటాయించబడ్డారు. భౌతికశాస్త్రంలో నిపుణుడైన ప్రసాదరావుకు 2014లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ‘వేవ్- పార్టికల్ డ్యూయాలిటీ ఆఫ్ లైట్’పై చేసిన పరిశోధనకు పీహెచ్డీ ప్రదానం చేసింది.
సీఎం కేసీఆర్ సంతాపం
ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేసిన బీ ప్రసాదరావు మరణం పట్ట ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ఆదివారం ఒక ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.