న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించడానికి ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో విదేశాంగ మంత్రి జైశంకర్తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా ఉన్నారు. ఈ కమిటీ ఆఫ్ఘనిస్థాన్లో భారత్ తక్షణ ప్రాధాన్యతలపై దృష్టి సారించనుంది. ప్రస్తుతానికి ఆ దేశంలో ఇంకా చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ఇండియా ప్రాధాన్యత ఇస్తోంది. గత రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘనిస్థాన్లో ఇండియా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ దేశానికి పార్లమెంట్ భవనాన్ని కూడా నిర్మించి ఇచ్చింది.
ఈ కమిటీ కొన్ని రోజులుగా సమావేశమవుతోంది. అక్కడి భారతీయులను సురక్షితంగా తీసుకురావడంపై, ఇండియాకు వస్తున్న ఆఫ్ఘన్ జాతీయులపై, ఇండియా లక్ష్యంగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఎలాంటి ఉగ్రవాదానికి తావు లేకుండా ఉండటంపై చర్చిస్తోంది అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆఫ్ఘన్లో తాలిబన్ల పాలనపై భారత్ వేచి చూసే ధోరణిలో ఉంది. అక్కడి పరిణామాలపై భద్రతా మండలి ప్రకటనతోపాటు అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తున్నది కూడా నిశితంగా పరిశీలిస్తోంది.