‘ప్రమాణం’ అనే పదం చాలామందికి ‘ఒట్టు’ అనే భావంలోనే తెలుసు. కానీ, ‘ప్రమాణం’ అనే దానికి మరిన్ని గంభీరమైన అర్థాలున్నాయి. ‘ప్రమాణం’ అనేది ‘ఋజువు’ కూడా అవుతుంది. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దేనిద్వారానైతే మనం దానిని గ్రహిస్తామో అది ప్రమాణమే. ‘ప్రమాణం’ అనే పదానికి ‘శాస్త్రం’ అనే ఇంకో అర్థమూ ఉంది. మనిషికి సహజంగానే ‘నాలుగు దోషాలు’ ఉంటాయి. అవి: భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కరణా పాటవ. ‘భ్రమ’కు లోను కావడం మనిషి మొదటి దోషం. కొన్ని పరిస్థితుల్లో అతడు భ్రమకు, మోహానికి గురవుతాడు. దాంతో సరైన నిర్ణయం తీసుకోలేకపోతాడు. ‘తప్పులు చేయడం’ (ప్రమాద) రెండవ దోషం. తప్పులు చేయని మనిషే ఉండడు. బుద్ధిమంతులు తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని ఉన్నతులుగా, అనుభవజ్ఞులుగా ఎదుగుతారు. తెలిసీ తప్పులు చేసేవారు కొందరైతే, తెలియక తప్పులు చేసేవారు ఇంకొందరు. మొత్తానికి మానవులు ఈ తప్పులు చేయడమనే దోషం నుంచి బయటపడే అవకాశమే లేదు.
మానవుల మూడవ దోషం ‘విప్రలిప్స’. అంటే ‘మోసం చేసే ప్రవృత్తి’. మనిషి తనను తాను మోసం చేసుకుంటూ ఉంటాడు లేదా ఇతరులనైనా మోసం చేస్తుంటాడు. లేని గుణాన్ని ఉన్నట్లుగా చెప్పుకోవడమూ మోసమే అవుతుంది. సమాజమంతా మోసం చేసేవారితోను, మోసానికి గురయ్యేవాళ్లతోను నిండి ఉందన్నది వాస్తవం. ఒకరి ద్వారా మరో వ్యక్తి మోసపోతే మోసపోయిన అతను ఇంకొకరిని మరొక విషయంలో మోసగిస్తుంటాడు. ఇలా సమాజం అంతా వంచకులు, వంచితులతోనే నిండి ఉంది. మనిషి చివరి దోషం ‘అసమగ్రమైన ఇంద్రియాలను కలిగి ఉండటం’ (కరణా పాటవ). ‘కండ్లతో చూసినంత మాత్రాన నమ్మలేం’ అనడంలోని అర్థమిదే. మన ఇంద్రియాలను మనమే నమ్మకుంటే ఇతరుల విషయంలో చెప్పేదేముంది! ఈ నాలుగు దోషాల కారణంగానే మనిషి అనేక ఇక్కట్లకు గురవుతుంటాడు. అవి ఈ లోకంలో కష్టాలను కలిగించడమేగాక తదుపరి జన్మలోనూ ఘోర యాతనలను కలిగిస్తుంటాయి. మరి, ఇహపరాలలో మనిషి సుఖభాగుడు కావడానికి ఏదైనా మార్గం ఉందా? దీనికి సమాధానమే శ్రీకృష్ణ భగవానుని ఈ అద్భుత సందేశం.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి
–భగవద్గీత (16.24)
మనిషి శాస్త్ర ప్రమాణం ద్వారా ఏది కార్యమో, ఏది అకార్యమో తెలుసుకోవాలి. ఆ మేరకు క్రమంగా ఉన్నతి పొందేలా కర్మలు చేయాలి. శాస్త్ర విధులను త్రోసిపుచ్చి తనకు తోచినరీతిగా ప్రవర్తించేవాడు పూర్ణత్వాన్ని, సుఖాన్ని, పరమగతిని పొందలేడు. ఎందుకంటే, అతను పై నాలుగు దోషగుణాలతోనే కార్యాచరణకు ప్రయత్నిస్తాడు. అది నిశ్చయంగా అతనికి పరాభవం లేదా పరాజయాన్నే కలిగిస్తుంది. కనుక, శాస్ర్తాన్నే ప్రమాణంగా తీసుకోవాలి. కోర్టుల్లో సాక్ష్యం చెప్పేముందు, కొన్ని దేశాల్లో పదవీ బాధ్యతలు చేపడుతున్నప్పుడు మత గ్రంథాలను ప్రమాణంగా స్వీకరిస్తారు. అప్పుడే మనిషి సావధానుడై సమున్నత భావాలను పుణికి పుచ్చుకుంటాడు.
మానవులకు ఉత్తమ శాస్త్రమేది? ‘ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం’. దేవకీ నందనుడైన శ్రీకృష్ణుడు చెప్పిన శాస్త్రమే ఏకైక శాస్త్రం. అందుకే, ఇహపరాలలో సుఖాన్ని కోరేవారు ‘భగవద్గీత’నే ప్రమాణంగా తీసుకోవాలి. గీతా మార్గదర్శనంలోనే నడవాలి. ‘భగవద్గీత’ను అనుసరించడానికి మూడు విషయాలు ముఖ్యమైనవి. అవి: విద్య, సంస్కృతి, భక్తి. ‘చదువు నేర్చుకోవడం’ (విద్య), ‘నేర్చుకున్న విద్యను ఆచరించడం’ (సంస్కృతి), ‘ఆచరణను త్రికరణశుద్ధితో అకుంఠితంగా నిర్వహించడం’ (భక్తి). ఈ మూడు కోణాల్లో ‘భగవద్గీత’ శాస్ర్తాన్ని మనిషి స్వీకరించగలిగితే నిశ్చయంగా సుఖభాగుడు, విజయపథగామి కాగలడు. మనందరికీ భగవద్గీతయే ప్రమాణమైన రోజు ఈ ప్రపంచం స్వర్గదాయకం లేదా వైకుంఠధామమే అవుతుంది.
–డాక్టర్ వైష్ణవాంఘ్రి సేవకదాస్
98219 14642