న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంతో సీఎంల సమావేశం సందర్భంగా దానిని కేజ్రీవాల్ లైవ్ టెలికాస్ట్ చేయడమే దీనికి కారణం.
కరోనాను ఎదుర్కోవడానికి ఓ నేషనల్ ప్లాన్ ఉండాల్సిన అవసరం ఉన్నదంటూ మాట్లాడుతున్న కేజ్రీవాల్ను మధ్యలో ఆపిన మోదీ.. ఇది పద్ధతి కాదు. పీఎంతో జరుగుతున్న ఇన్హౌస్ మీటింగ్ను లైవ్ టెలికాస్ట్ చేయడం ప్రొటోకాల్ను ఉల్లంఘించడమే అవుతుందని మోదీ అన్నారు. అయినా కూడా కేజ్రీవాల్ మాత్రం మోదీ చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా తాను చెప్పాల్సింది చెబుతూ వెళ్లారు. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించాలని అన్నారు.