న్యూయార్క్: గడిచిన ఏడాదిన్నర కాలంగా ప్రపంచదేశాలు కరోనా మహమ్మారితో సతమతమవుతున్నాయని, గత వందేండ్లలో ఇలాంటి మహమ్మారి విజృంభించడం ఇదే తొలిసారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి నివాళులు అర్పిస్తున్నానని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణసభ 76వ సెషన్లో ప్రసంగిస్తూ ప్రధాని కరోనా మహమ్మారి ప్రస్తావన చేశారు.
ఈ ఏడాది ఆగస్టు 15న తాము 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నామని, మా దేశంలోని విభిన్నత్వమే మా బలమైన ప్రజాస్వామ్యానికి గుర్తు అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కరోనా వేళ భారత్ వ్యాక్సిన్ హబ్గా నిలిచిందన్నారు. అదేవిధంగా ప్రపంచంలోని వ్యాక్సిన్ తయారీదారులందరినీ భారత్లో వ్యాక్సిన్ల తయారీకి ముందుకు రావాలని ఆహ్వానించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్ఏ వ్యాక్సిన్ను భారత్ తయారు చేసిందని చెప్పారు. 12 ఏండ్ల వయసు దాటిన ఎవరికైనా ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చని చెప్పారు.
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కూడా తుది దశలో ఉన్నదన్నారు. భారత శాస్త్రవేత్తలు ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారని ప్రధాని చెప్పారు. కరోనా సమయంలోనూ భారత్లో మూడు కోట్ల మందికి ఇండ్లు కట్టిచ్చామన్నారు. భారత్లో అభివృద్ధితో ప్రపంచం అభివృద్ధిలోనూ వేగం పెరిగిందని చెప్పారు. దేశంలో ఆరు లక్షల గ్రామాలను డ్రోన్ మ్యాపింగ్ చేశామని, అంతేగాక పలు డిజిటల్ సంస్కరణలు చేపడుతున్నామని ప్రధాని చెప్పారు.